నైట్ కర్ఫ్యూ వేళ పోలీసుల లాఠీచార్జ్ అంటూ యూట్యూబ్‌లో వీడియోలు.. చానల్ రిపోర్టర్ అరెస్ట్

  • కరోనా కట్టడికి నైట్ కర్ఫ్యూ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
  • నిన్నటి నుంచే అమల్లోకి
  • తొలి రోజు పోలీసులు లాఠీలకు పనిచెప్పారంటూ వీడియోలు
  • క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించిన హైదరాబాద్ సీపీ
తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ ప్రకటించింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రకటించింది. నిన్నటి నుంచే ఇది అమల్లోకి వచ్చింది. కర్ఫ్యూ నిర్ణయాన్ని ప్రభుత్వం నిన్ననే ప్రకటించి నిన్నటి నుంచే అమలు చేయడంతో చాలామందికి ఈ విషయం చేరలేదు. దీంతో పోలీసులు తొలి రోజు కాస్తంత చూసీచూడనట్టు వ్యవహరించారు.

అయితే, రాత్రి తొమ్మిది గంటల తర్వాత రోడ్లపై కనిపించిన ప్రజలపై పోలీసులు లాఠీలు ఝళిపించారంటూ ఓ యూట్యూబ్ చానల్‌ పలు వీడియోలను పోస్టు చేసింది. ఇందులో ప్రజలపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడుతున్నట్టు ఉంది. దీనిని తీవ్రంగా పరిగణించిన పోలీసులు ఆ వీడియోలు పోస్టు చేసిన చానల్ రిపోర్టరుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు వీడియోలు పోస్టు చేసేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ హెచ్చరించారు.

Night Curfew
Hyderabad
Police
Anjani Kumar
Youtube

More Telugu News